ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది. అంతే కాదు ఆ మైనర్ బాలికను హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని రైల్వే పట్టాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అన్షు గౌతమ్, అతని సహచరులు ఆశిక్, వైభవ్, రిషబ్గా గుర్తించారు.
అన్షు ఆ బాలికతో ఇన్స్టాగ్రామ్లో స్నేహం చేశాడు. మొబైల్ ఫోన్ లోనూ, సోషల్ మీడియాలోనూ మాట్లాడేవాడని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అన్షు ఆమెను ప్రలోభపెట్టాడని ఆరోపించింది. తన కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్స్పెక్టర్ సురేష్ సింగ్ నేతృత్వంలో ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను త్వరగా అరెస్టు చేశారు. విచారణలో అన్షు అతడి సహచరుల మధ్య ఒక వివాదం జరిగింది.. ఆ తర్వాత బాలిక గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని రైల్వే పట్టాలపై పడేశారని అంగీకరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ కేసులో పోక్సో చట్టంతో సహా కఠినమైన సెక్షన్లను ప్రయోగించామని పోలీసులు తెలిపారు.