Kukatpally Murder Case : ప్లాన్ ప్రకారమే హత్య.. విచారణలో విస్తుపోయే నిజాలు.!
కూకట్పల్లి బాలిక సహస్రాని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
By Medi Samrat
కూకట్పల్లి బాలిక సహస్రాని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలికను హత్య చేసిన బాలుడి సైకో అవతారం బట్టబయలైంది. యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసినట్లు వెల్లడైంది. పక్క పథకం ప్రకారం బాలుడు క్రైమ్ సీన్ రచించాడు. 10వ తరగతి దశలోనే క్రైమ్ చెయ్యడం నేర్చుకున్న బాలుడి తీరును చూసి పోలీసులు అవాక్కయ్యారు.
నిందితుడు హత్య చేసి ఆ తర్వాత ఆధారాలు మాయం చెయ్యడం నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే అసలు నిజాలు రాబట్టేందుకు పదుల సంఖ్యలో పోలీసులు నిందితుడిని విచారించగా.. క్రిమినల్ ఇంటిలెజెంట్గా వ్యవహరించాడని బాలానగర్ డీసీపీ వెల్లడించాడు. పోలీసులను రూట్ మార్చి డైవర్షన్ చేశాడు. క్రైమ్ సీన్ను తలపించేలా నిందితుడు హత్యకు ప్లాన్ చేశాడు.
హత్య చేసిన బాలుడు క్రికెట్ ఆటగాడు. క్రికెట్ బ్యాట్, కిట్ కోసమే సహస్రాని ఇంటికి వెళ్లాడు. క్రికెట్ కిట్ తీసుకోబోతున్న సందర్భంలో నిందితుడు, సహస్రాని మధ్య గొడవ జరిగింది. క్రైమ్ సీన్ గుర్తుకొచ్చి.. దొంగతనం చేసేది ఎవరికీ తెలియకుండా ఉండాలని కత్తితో బాలికపై దాడి చేశాడు. ఆపై సహస్రాణి చనిపోయిన తర్వాతే ఇంటి బయట డోర్ పెట్టి వెళ్లిపోయాడు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రైమ్ సీన్లకు అలవాటైన బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకుని తిరుగుతాడని వెల్లడైంది. చోరీకి రెండు రోజుల ముందే బాలుడు ప్లాన్ వేసుకున్నాడు. తండ్రి ఏ పని చేయడు.. తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగిని. బాలుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, చోరీలు, హత్యల గురించి బాలుడు రాసుకున్న పుస్తకాన్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.
సహస్రాణి తండ్రి మీడియాతో మాట్లాడుతూ. తన కూతుర్ని చంపిన బాలుడికి ఉరి శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశాడు. అతడికి ఏ మాత్రం భయం, పశ్చాతాపం లేవని.. పెద్దవాళ్ల తరహాలో హత్యకు పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.