చిన్న వ‌య‌సు వ్య‌క్తితో ఎఫైర్‌.. పెళ్లైన ఆరు రోజుల‌కే భ‌ర్త మ‌ర్డ‌ర్‌కు స్కెచ్‌.. విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య మిస్టరీ బట్టబయలైంది. అత‌డి

By Medi Samrat
Published on : 9 Jun 2025 2:34 PM IST

చిన్న వ‌య‌సు వ్య‌క్తితో ఎఫైర్‌.. పెళ్లైన ఆరు రోజుల‌కే భ‌ర్త మ‌ర్డ‌ర్‌కు స్కెచ్‌.. విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య మిస్టరీ బట్టబయలైంది. అత‌డి భార్య సోనమ్.. రఘువంశీని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ జంట హనీమూన్ కోసం ఇండోర్ నుండి మేఘాలయకు వెళ్లారు. అక్కడ రాజా రఘువంశీ హత్య జ‌రిగింది.

రాజా మృతదేహం దొరికిన తర్వాత.. సోనమ్ 17 రోజులు కనిపించకుండా పోయింది. ఈ గ్యాప్‌లో అందరూ ఆమెను బాధితురాలిగా పరిగణించారు. మొదట్లో ఆమె భర్త రాజాను ఎవరో హత్య చేశారని.. ఆమె కూడా కనిపించకుండా పోయింద‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటికి రావడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

సోనమ్ యూపీలోని ఘాజీపూర్‌లోని ఓ దాబాలో కనిపించింది. ఘాజీపూర్ పోలీసులకు ఫోన్ చేసి సోనమ్ స్వయంగా లొంగిపోయిందని మేఘాలయ డీజీపీ తెలిపారు. రాజా రఘువంశీ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ముగ్గురూ ఇండోర్ వాసులు. ఇండోర్ పోలీసులు కూడా ఈ విచారణలో మేఘాలయ పోలీసులకు సహాయం చేస్తున్నారు. రాజా రఘువంశీ హత్యకు సంబంధించిన ఇతర సమాచారాన్ని మేఘాలయ పోలీసులు త్వరలో మీడియాతో పంచుకోనున్నారు.

మే 11న సోనమ్, రాజా రఘువంశీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మే 20న మేఘాలయలోని షిల్లాంగ్‌కు ఇద్దరూ హనీమూన్‌కి వెళ్లగా, 23న కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల తరువాత జూన్ 2న రాజా మృతదేహం వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలో లోతైన గుంటలో కనిపించింది. అత‌డి చేతిపై ఉన్న టాటూ ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. కానీ సోనమ్ జాడ తెలియ‌లేదు.

ఇక్కడ ఒక గైడ్ వాంగ్మూలం ఈ హత్య మిస్టరీలో పెద్ద ట్విస్ట్ తెచ్చింది. మే 23న ముగ్గురు వ్యక్తులతో రాజా, సోనమ్‌లు వెళ్లడం తాను చూశానని మేఘాలయకు చెందిన ఓ గైడ్ చెప్పాడు. ఇది ముగ్గురు అనుమానితులను చేరుకోవడానికి పోలీసులకు సహాయపడింది. ఇదీకాక.. హనీమూన్ ప్లాన్ చేసింది సోనమ్ అని.. ఆమెనే టిక్కెట్లు బుక్ చేసిందని రాజా తల్లి చెప్పారు. అయితే.. సోనమ్ డిపార్చర్ టికెట్ బుక్ చేసిందని.. రిటర్న్ టికెట్ కాదని కూడా పోలీసులు గుర్తించారు.

సోనమ్ అరెస్ట్ తర్వాత అనేక విషయాలు వెల్లడయ్యాయి. సోనమ్, ఆమె కుటుంబానికి ప్లైవుడ్ వ్యాపారం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ షాపులో రాజ్ కుష్వాహ అనే ఉద్యోగి పనిచేసేవాడు. సోనమ్, రాజ్ కుష్వాహకు మ‌ధ్య‌ చాలా కాలంగా ఎఫైర్ నడుస్తున్న‌ట్లు గుర్తించారు. సోనమ్ తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన‌ ఉద్యోగితో ప్రేమలో ఉంది. అందుకే వివాహం జరిగిన ఆరు రోజులకే రాజాను హత్య చేయాలని ప్లాన్ చేసిందని పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.

Next Story