భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

Husband brutally murdered Wife. సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి నూతన్‌ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  15 July 2023 12:12 PM GMT
భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి నూతన్‌ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు. సత్యనారాయణ గత కొంతకాలంగా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన సత్యనారాయణ ప్రతిరోజు మద్యం సేవించి డబ్బుల విషయంలో భార్యతో గొడవ పడేవాడు. నిత్యం డబ్బుల కోసం సత్యనారాయణ తనతో గొడవ పడుతూ ఉండడంతో విసుకు చెందిన ఝాన్సీ.. అమలాపురంలోని పోలీస్ స్టేషన్‌లో పలుమార్లు భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. తిరిగి సత్యనారాయణ పీకల దాకా మద్యం సేవించిన అనంతరం ఇంటికి వచ్చి తన భార్యను డబ్బుల కోసం వేధిస్తూ గొడవకు దిగేవాడు. రోజు రోజుకు భర్త ఆగ‌డాలు ఎక్కువ‌వ‌డంతో విసుకు చెందిన ఝాన్సీ.. బోయిన్‌ప‌ల్లిలోని బంధువుల ఇంటికి వెళ్ళింది.

పీకలదాకా మద్యం సేవించిన సత్యనారాయణ భార్య ఇంట్లో లేకపోవడంతో.. బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్క‌డ‌ భార్యతో గొడవ కు దిగాడు. ఇద్దరు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఆగ్రహానికి లోనైనా సత్యనారాయణ తనతో పాటు తెచ్చిన‌ కత్తితో ఝాన్సీపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఝాన్సీ కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఝాన్సీ అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు.


Next Story