మ‌రో హనీమూన్ జంట అదృశ్యం

హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.

By Medi Samrat
Published on : 11 Jun 2025 10:59 AM IST

మ‌రో హనీమూన్ జంట అదృశ్యం

హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది. కాగా, హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన మ‌రో జంట అదృశ్యమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర, అంకిత మే 5న వివాహం చేసుకోగా.. మే 26న ఇద్దరూ హనీమూన్ కోసం సిక్కిం వెళ్లారు. మే 29న సిక్కింలో వర్షం కారణంగా 11 మంది పర్యాటకులతో నిండిన కారు కాలువలో పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు.

నవ దంపతుల అదృశ్యంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ధన్‌గఢ్ సరాయ్ చివాలా పట్టి నివాసి రాజేష్ సింగ్ కుమార్తె అంకితకు సంగీపూర్ రహతికర్ గ్రామానికి చెందిన షేర్ బహదూర్ కుమారుడు కౌశలేంద్రతో మే 5న వివాహం జరిగింది.

కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్‌తో సహా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ వాతావరణం బాగా లేద‌ని చెప్పారు. వర్షం పడుతోంది. రోడ్లు తెగిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.. ఇప్పటివరకు ఆ జంటకు సంబంధించిన ఎటువంటి వస్తువులు కనబడలేదు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అక్కడి గవర్నర్ ప్రభుత్వ అధికారులకు ఫోన్‌లో సూచించారు. ఇంట్లో కుటుంబ సభ్యులు వేచి ఉన్నామ‌ని పేర్కొన్నారు.

సిక్కింలో కొడుకు, కోడలు కోసం వెతుకుతున్న తండ్రి, కుటుంబ సభ్యులు నిరాశతో ఇంటికి చేరుకున్నారు. ఏదో అవాంఛనీయమైన భయం ఎక్కువైంది. కానీ మనసులో మాత్రం ఇంకా ఆశ వదులుకోవడం లేదు.

కౌశలేంద్ర తండ్రి షేర్ బహదూర్ సింగ్, అంకిత సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో సహా అర డజను మంది మే 31 నుండి అతని కొడుకు, కోడలు కోసం సిక్కిం వెళ్లారు. డిప్రెషన్ కారణంగా తండ్రి ఆరోగ్యం క్షీణించగా.. కుటుంబం అతన్ని తిరిగి ప్రతాప్‌గఢ్‌కు తీసుకెళ్లింది.

Next Story