కల్పనను కిరాత‌కంగా హత్య చేసిన పింకు ఎట్టకేలకు అరెస్టు

Haryana Cops Arrest Man Who Burnt Wife's Face, Killing Her, After Fight. మద్యం సేవించడం ఆపేయాలని కోరిన భార్యను.. కాలుతున్న పొయ్యిపై ముఖం పెట్టి హత్య

By M.S.R  Published on  30 Dec 2022 11:49 AM GMT
కల్పనను కిరాత‌కంగా హత్య చేసిన పింకు ఎట్టకేలకు అరెస్టు

మద్యం సేవించడం ఆపేయాలని కోరిన భార్యను.. కాలుతున్న పొయ్యిపై ముఖం పెట్టి హత్య చేసిన వ్యక్తిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నేరం జరిగిన తర్వాత అతడు పరారీలో ఉన్నాడు. ఆగస్టు 2021లో ఈ దారుణానికి ఒడిగట్టిన అతడు అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ మీదుగా తన స్థానాన్ని మారుస్తూనే ఉన్నాడు. అతన్ని పట్టుకున్నందుకు ₹ 5,000 రివార్డ్ కూడా పోలీసులు ప్రకటించారు. నిందితుడిని యూపీలోని బులంద్‌షహర్ నివాసి పింకుగా గుర్తించారు. 2021 ఆగస్టులో అతని భార్య కల్పనను హత్య చేసినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. ఈ జంటకు వివాహమై ఆరేళ్లైంది, వీరిద్దరూ హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఖేదీ కాలా గ్రామంలోని ఓ బట్టీలో కూలీగా పనిచేసేవారు.

నిందితుడు మద్యానికి బానిస కావడంతో అతని వ్యసనంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆగస్ట్ 6, 2021న ఉదయం 7 గంటల ప్రాంతంలో కల్పన వంట చేస్తుండగా, ఆమె భర్త మద్యం తాగుతున్నాడు. మద్యం తాగడం ఆపమని అతడిని కోరగా.. నిందితుడికి విపరీతమైన కోపం వచ్చింది. కల్పన తలను మండుతున్న పొయ్యిలోకి పెట్టాడు. దాని కారణంగా ఆమె ముఖం కాలిపోయింది. ఆ తర్వాత కూడా నిందితుడు ఆమెపై దాడి చేశాడు. ఆమె ముఖంపై ఉడకబెట్టిన పప్పును పోసి.. ఇంకోసారి తాగడం మానేయాలని కోరితే చంపేస్తానని బెదిరించాడు.

బాధితురాలి బంధువులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు, కొన్ని రోజుల తరువాత ఆమె చికిత్స పొందుతూ మరణించింది రెండు రోజుల క్రితం నిందితుడు ఫరీదాబాద్‌లో ఉన్నట్లు పోలీసులకు రహస్య వర్గాల నుంచి సమాచారం అందింది. క్రైం బ్రాంచ్‌కు చెందిన పోలీసు బృందం నిందితుడిని అరెస్టు చేసింది. పోలీసుల విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.


Next Story