అస్సాం-మేఘాలయ సరిహద్దులో మంగళవారం ఉదయం అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రక్కును పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన ఘర్షణలో ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను 48 గంటలపాటు నిలిపివేసింది. నివేదికల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అస్సాం అటవీ శాఖ బృందం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని మోయిక్రాంగ్లోని మేఘాలయ సరిహద్దు వద్ద ట్రక్కును అడ్డుకుంది.
ట్రక్కులోని స్మగ్లర్లు పారిపోవడానికి ప్రయత్నించగా.. ఛేజింగ్ జరిగింది. చివరకు ఫారెస్ట్ గార్డులు వాహనంపై కాల్పులు జరిపి టైరు పంక్చర్ చేశారు. ముగ్గురిని ఫారెస్ట్ గార్డులు పట్టుకుని జిరికింగ్కు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఫారెస్ట్ గార్డులు జిరికెండింగ్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి.. బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు.
పెద్ద సంఖ్యలో మేఘాలయ ప్రజలు 'దావో' (బాకు), ఇతర ఆయుధాలతో తెల్లవారుజామున 5 గంటలకు సంఘటనా స్థలం వద్ద గుమిగూడారని సీనియర్ పోలీసు అధికారిని ఉటంకిస్తూ.. పిటిఐ నివేదించింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నవెంటనే ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవలసి వచ్చింది. ఫలితంగా ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన ఫారెస్ట్ గార్డును బిద్యా సింగ్ లెహ్తేగా గుర్తించగా, మరో ఫారెస్ట్ గార్డు అభిమన్యు గాయపడ్డాడు. "ఈ ఘటనలో ఫారెస్ట్ హోంగార్డు, ఖాసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని పోలీసు అధికారి తెలిపారు.