నెల్లూరు జిల్లాలో ఐదుగురు ఆత్మహత్య

Five people committed suicide in two incidents in Nellore. కుటుంబ కలహాలతో ఏపీలోని నెల్లూరులో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

By అంజి  Published on  1 Sep 2022 3:32 PM GMT
నెల్లూరు జిల్లాలో ఐదుగురు ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఏపీలోని నెల్లూరులో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ఘటనలో తండ్రీకొడుకులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ఘటనలో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

నెల్లూరు రూరల్‌లోని కొత్తూరు అంబాపురంలో నివాసం ఉంటున్న రంగస్వామికి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన రంగస్వామి ఇద్దరు కుమారులను తీసుకుని సమీపంలోని మైదాన బావి వద్దకు వెళ్లగా పెద్ద కుమారుడు తప్పించుకుని పారిపోయాడు. రామస్వామి, అతని చిన్న కుమారుడు శివకుమార్‌ ఇద్దరూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు . ఈ సమాచారాన్ని పెద్ద కుమారుడు గ్రామస్తులకు వివరించగా, బావి వద్దకు చేరుకునే సరికి తండ్రీకొడుకులు అప్పటికే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు.

ఇక మరో ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని జై భీమ్‌నగర్‌లో సాదం గీత అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు వెంకట్ (10), చరిష్మా (5)తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. గీత భర్త వెంకటరావు సమీపంలోని గ్యాస్ గోడౌన్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వచ్చి చూడగా భార్య, ఇద్దరు పిల్లలు ఉరివేసుకుని ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. తల్లి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story