ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్ అరెస్ట్‌

Courier Boys Arrested In Huzurabad. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఫ్లిప్ కార్ట్ పేర ఘరానా మోసాలకు పాల్పడుతున్

By Medi Samrat  Published on  30 Aug 2021 8:53 AM GMT
ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్ అరెస్ట్‌

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఫ్లిప్ కార్ట్ పేర ఘరానా మోసాలకు పాల్పడుతున్న కొరియర్ బాయ్స్ ని పోలీసులు అరెస్టు చేశారు. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన నీర్ల కళ్యాణ్, ఆనగొని వికాస్, కనుకుంట్ల అనిల్, తూటి వినయ్‌లు హుజురాబాద్ పట్టణంలోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మూడు నెలలుగా ఫ్లిప్ కార్ట్ కొరియర్ బాయ్స్ గా ప‌నిచేస్తున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ లో వ‌స్తువులు ఎలా కొట్టెయాలో చూసి.. నిందితులు వారు డెలివరీ చేసే రూట్ లో, వారి పేరుపై కొన్ని, వారి బంధువులు, ఫ్రెండ్స్ పేర్లపై విలువైన వస్తువులను ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసుకునేవారు. ఆ వస్తువులు హుజురాబాద్ లోని ఫ్లిప్ కార్ట్ హబ్ కి రాగానే.. వాటిని డెలివరీ కోసం వారి పేరుపై అసైన్ చేసుకొని సైదాపూర్ కి తీసుకెళ్ళేవారు.

అక్కడ ముందు గానే అనుకున్నట్లు బుక్ చేసిన ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి.. ఆ ఫోన్ నంబర్ నుండి వారి మిత్రుల ద్వారా అట్టి ఆర్డర్స్ రిజెక్ట్ చేయడం గాని.. ఆర్డర్ చేసిన ఫోన్ నంబర్ ని స్విచ్ ఆఫ్ పెట్టడం లేక కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండటం చేసేవారు. ఆ త‌ర్వాత‌ కస్టమర్ నుండి రెస్పాన్స్ లేదు అని చెప్పి.. తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో ఏర్పడకుండా వాటిని కత్తిరించి వ‌స్తువులను తీసి.. అందులో రాళ్లు, పెంకులు, చాపతి బండలను వస్తువుల బ‌రువుకు తగ్గట్టు పెట్టి ప్యాక్ చేసి వాటిని మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేసేవారని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆ త‌ర్వాత‌ ఖరీదైన వస్తువులను అమ్ముకొని.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని తెలిపారు.

ఈ క్రమంలో అనుమానం వచ్చిన ఫ్లిప్ కార్ట్ హుజురాబాద్ హబ్ టీం లీడర్ ముప్పు నవీన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి విచారించగా, దర్యాప్తులో నిందితులు చాలా వస్తువులను దొంగిలించినట్లు తేలింది. పక్క సమాచారం మేరకు ఈ రోజు ఉదయం 12 గంటలకు నిందితులు మళ్ళీ ఈ తరహా దొంగ‌త‌నం చేయడం కోసం.. సైదాపూర్ బస్ స్టాండ్ వద్ద వేచి ఉన్న తరుణంలో.. సైదాపూర్ ఎస్సై ప్రశాంత్ రావు తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుల‌ నుండి రూ.9 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న హుజరాబాద్ రూరల్ సీఐ ఏర్రల కిరణ్ మ‌రియు సిబ్బందిని ఏసీపీ వెంకట్ రెడ్డి అభినందించారు.


Next Story