Khammam : ప్రియుడి మోజులో భర్త హత్యకు భార్య రూ.20 లక్షల సుపారీ..!
ఖమ్మం జిల్లాలో ఒక మహిళ, ఆమె ప్రియుడు కలిసి తన భర్తను కిడ్నాప్ చేసి చంపడానికి లక్షల్లో సుపారీ ఇచ్చారు.
By Medi Samrat
ఖమ్మం జిల్లాలో ఒక మహిళ, ఆమె ప్రియుడు కలిసి తన భర్తను కిడ్నాప్ చేసి చంపడానికి లక్షల్లో సుపారీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కిల్లర్లను పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఖమ్మంలోని బారుగూడెం గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు (34), కారు డ్రైవర్, యజమాని అయిన దంతాల వెంకట నారాయణ అలియాస్ వెంకట్ (31), మోటార్ సైకిల్ మెకానిక్ పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటి (30), వేముల కృష్ణ (21), డెకరేషన్ వర్కర్ బుర్రి విజయ్ (23) లను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారందరూ ఖమ్మం నివాసితులు.
ముదిగొండ మండలం సువర్ణపురానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె భర్తకు తెలిసి విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషీటర్ అయిన పగడాల విజయ్కుమార్ ని పరిచయం చేశాడు. హత్యకు రూ.20లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్గా మహిళ నుంచి తీసుకున్నారు. మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. ఆ భర్త ఏప్రిల్ 11న ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. నిందితులు ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు.