సంసారాన్ని నడపడం కోసం మగవాడు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. అలాంటిది ఒకే మగాడు మూడు సంసారాలను నెట్టుకు రావాలంటే? మరెన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అతనికి తొమ్మిది మంది పిల్లలు.. వారిని పోషించడానికి అతడు చివరికి దొంగగా మారాడు.
తన ముగ్గురు భార్యలు, తొమ్మిది మంది పిల్లలకు ఆర్థిక సహాయం అందించడానికి దొంగతనాలకు పాల్పడిన 36 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. బాబాజాన్గా గుర్తించబడిన నిందితుడిని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 188 గ్రాముల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 1,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది దొంగతనాలకు సంబంధించిన కేసులను అతడి అరెస్టుతో పరిష్కరించామని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కుటుంబాలను పోషించడం అతనికి కష్టంగా ఉండడంతో దొంగగా మారాడని పోలీసులు వివరించారు.
బాబాజాన్ తన కుటుంబ ఖర్చులను తీర్చడానికి దొంగతనం వైపు మొగ్గు చూపాడు. అతని భార్యలు వేర్వేరు ప్రదేశాలలో నివసిస్తున్నారు: బెంగళూరు శివార్లలోని అనేకల్ సమీపంలోని శికారిపాల్య, చిక్కబళ్లాపుర, శ్రీరంగపట్నంలో ఉన్నారు. మూడు కుటుంబాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే అతను ఒక ప్రొఫెషనల్ దొంగగా మారాడని అధికారులు తెలిపారు.