వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను న‌రికిన‌ భ‌ర్త‌.. త‌ల‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తలను న‌రికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

By Medi Samrat
Published on : 7 Jun 2025 8:55 PM IST

వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను న‌రికిన‌ భ‌ర్త‌.. త‌ల‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి..

క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్య తలను న‌రికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. నిందితుడు శంకర్ అనే వ్యక్తి తన 26 ఏళ్ల భార్య మానసను వివాహేతర సంబంధం పేరుతో అనుమానిస్తూ తీవ్ర ఘర్షణకు దిగి ఆమెను హత్య చేసిన‌ట్లు తెలుస్తుంది.

పోలీసుల కథనం ప్రకారం.. శంకర్, మానస దంపతులు కొంత కాలం క్రితం హీలలిగే గ్రామంలో అద్దె ఇంట్లోకి మారారు. జూన్ 3వ తేదీ రాత్రి శంకర్ మరుసటి రోజు ఉదయం తిరిగి వస్తానని మానసకు తెలియజేసి పనికి బయలుదేరాడు. అయితే, అతను పనిని త్వరగా ముగించి ఆ రాత్రి అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ స‌మ‌యంలో మానస మరొక వ్యక్తితో ఉన్నట్లు శంక‌ర్ ఆరోపిస్తున్నాడు. ఆ రాత్రే గొడవ జరిగి మానస ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఆ తర్వాత మానస ఇంటికి వచ్చి శంకర్‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది. హత్యకు ముందు రోజు రాత్రి కూడా మాన‌స మళ్లీ ఇంటికి వచ్చి గొడ‌వ ప‌డ‌గా.. శంకర్ తీవ్ర ఆగ్ర‌హానికి గురైన‌ట్లు తెలుస్తుంది. ఈ క్ర‌మ‌లోనే శంకర్ మానస తల నరికి చంపి, నరికిన తలతో సూర్యనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అధికారులకు లొంగిపోయాడు.

గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో భర్త మానసను కొట్టి దారుణంగా హతమార్చాడు. శిరచ్ఛేదం చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నేరం అంగీకరించాడు. అతడిపై హత్యకేసు నమోదు చేశాం. భార్య‌కు అక్ర‌మ సంబంధం ఉందని.. గత వారం పనికి వెళ్లి వ‌చ్చాక భ‌ర్త‌కు విష‌యం తెలిసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆఖ‌రికి ఆ గొడ‌వ హ‌త్య‌కు దారి తీసింద‌ని బెంగళూరు గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ (SP) సికె బాబా అన్నారు.

సూర్యనగర్‌ స్టేషన్‌ నుంచి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. శంకర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతుంది.

Next Story