ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని చితక్కొట్టిన రౌడీలు.. ఎందుకో తెలుసా.?

ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  6 April 2024 9:26 AM GMT
ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని చితక్కొట్టిన రౌడీలు.. ఎందుకో తెలుసా.?

ఓ ప్రైవేట్ సంస్థలో ఆడిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఐదుగురిలో ఇద్దరు ఆడిటర్ కు సహోద్యోగులని.. బాధితుడిని కొట్టడానికి గూండాలను నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కళ్యాణ్ నగర్ సమీపంలోని రింగ్ రోడ్డుపై నిందితులు ఆడిటర్ సురేష్‌ను ఇనుప రాడ్‌తో కొట్టడం కారు డాష్ కెమెరాలో రికార్డు అయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ బెంగళూరులోని ఓ పాల ఉత్పత్తుల కంపెనీలో ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఉమాశంకర్, వినేష్ కూడా అతనితో కలిసి కంపెనీలో పనిచేశారు. వారిని విచారించగా, సురేష్ తమపై ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడి పెంచాడని, స్ట్రిక్ట్ గా ఉంటూ ఇబ్బందులు పెడుతూ ఉండేవాడని నిందితులు నేరం అంగీకరించారు. సురేష్ ఏడాది క్రితమే కంపెనీలో చేరాడని, స్ట్రిక్ట్ ఆడిటింగ్ అధికారి అని నిందితులు తెలిపారు.

సురేష్ రాకముందు నిందితులు సంస్థలో ఆడింది ఆట.. పాడింది పాటలా వ్యవహరించేవారని.. అతడొచ్చాకనే సమయానికి పని చేయండి, ఇచ్చిన విధులను త్వరగా పూర్తీ చేయాలనే నిబంధనలను తీసుకుని వచ్చాడు. ఈ విషయాన్ని సురేష్ కంపెనీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడంతో ఉమాశంకర్, వినేష్‌లపై కఠిన చర్యలు తీసుకున్నారు. సురేష్ చేసిన పనిపై కోపం పెంచుకున్నారు. ఉమాశంకర్ సూచనల మేరకు.. కేఆర్ పురం నుండి కొంతమంది గూండాలతో డీల్ మాట్లాడుకున్నారు. సురేష్‌ను వెంబడించి ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియో వైరల్ కావడంతో హెన్నూరు ప్రాంతంలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతూ ఉంది.

Next Story