అఘోరీ శ్రీనివాస్ను ఎట్టకేలకు జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ను ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్ జెండర్ ఫీమేల్గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. పోలీసులు శ్రీనివాస్ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక ఆధారంగా చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.
అంతకు ముందు అఘోరీ విషయంలో సంగారెడ్డి జైలు అధికారులు తలలు పట్టుకున్నారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్లోనూ ఉంచలేమని అధికారులు చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ గట్టిగా అరిచింది. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు.