హర్యానాలోని ఫతేహాబాద్లో 14 మందితో వెళ్తున్న వాహనం కాలువలోకి పడిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. పలువురు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.
సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్లోని ఫజిల్కాలో ఓ వివాహ వేడుకకు హాజరైన 14 మంది తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం ఫతేహాబాద్లోని కాలువలోకి దూసుకెళ్లింది. 14 మందిలో 6 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఇద్దరు ప్రాణాలతో ఉన్నారని, మిగిలిన 6 మంది గల్లంతయ్యారని తెలిపారు. NDRF, SDRF బృందాలు రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.. ఆరు మృతదేహాలు వెలికి తీశామని, ఇంకా ఆరుగురి ఆచూకీ లభించలేదని SDM చంద్ర విలేకరులతో అన్నారు. నీటిపారుదల శాఖతో మాట్లాడిన తర్వాత కాలువలో నీటిమట్టం తగ్గిందని, కాల్వ చుట్టూ శాశ్వత బారికేడింగ్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా సేఫ్టీ బారికేడ్ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.