జమ్మూ కశ్మీర్ కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. చషోటి గ్రామం హిమాలయాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా చండీ ఆలయానికి చివరి రహదారి మార్గంగా ఉంది. అలాగే ప్రతి ఏడాది జరిగే మచైల్ మాతా యాత్రకు ప్రారంభ స్థానం. ఈ ఆకస్మిక వరదల కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 38 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కిష్ట్వార్ వరద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికోసం ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తాం” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.