ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జమ్మికుంటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పద్నాలుగేళ్ల మైనర్ బాలికపై ఇరవై ఐదేళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపులు కొంతకాలంగా కొనసాగుతున్నాయని భావిస్తున్నప్పటికీ.. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికతో యువకుడు సన్నిహితంగా మెలిగేవాడు. ఈ క్రమంలోనే బాలికతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తూ ఆమెపై దౌర్జన్యాన్ని కొనసాగించాడు. నిందితుడి టార్చర్ భరించలేకపోయిన బాలిక.. ఇటీవల విషయాన్ని తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.