ఘోర అగ్నిప్ర‌మాదం.. 14 మంది స‌జీవ ద‌హ‌నం

14 Charred to death after fire breaks out at a multi-storey building in Jharkhand.అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2023 3:06 AM GMT
ఘోర అగ్నిప్ర‌మాదం.. 14 మంది స‌జీవ ద‌హ‌నం

అపార్టుమెంట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది మ‌ర‌ణించారు. మ‌రో 11 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

రాష్ట్ర రాజధాని రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలోని ధన్‌బాద్‌లోని జోరాఫటక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ బిల్డింగ్‌లోని రెండో అంత‌స్తులో మంగ‌ళ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల స‌మ‌యంలో మంట‌లు చెల‌రేగాయి. అగ్నికీల‌లు వేగంగా వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

40 ఫైరింజ‌న్ల రంగంలోకి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చాయి. ఈ ప్ర‌మాదంలో 14 మంది మ‌ర‌ణించారు. మృతుల్లో 10 మంది మ‌హిళ‌లు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉంది. మ‌రో 11 మందికి గాయాలు కాగా వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. మంటల్లో చిక్కుకున్న ప‌లువురిని సుర‌క్షితంగా కింద‌కు తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. అగ్నిప్ర‌మాదానికి గ‌ల ఖ‌చ్చిత‌మైన కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

ప్ర‌ధాని దిగ్భ్రాంతి

ఈ ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ధ‌న్‌బాద్‌లో అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించిన మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం, గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Next Story