కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు

By అంజి  Published on  10 April 2024 4:10 AM GMT
Crimenews, Chhattisgarh, Durg, Road accident

కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో 12 మంది మరణించారు. ఎక్కువ మంది గాయపడ్డారు. దాదాపు 40 మందితో వెళ్తున్న బస్సు 50 అడుగుల ఎత్తు నుండి బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సు కార్మికులను వారి షిప్టు తర్వాత ఇంటికి తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్పీ జితేంద్ర శుక్లా తెలిపారు. ప్రాథమిక విచారణలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో గాయపడిన 14 మందిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా మేజిస్ట్రేట్ రిచా ప్రకాష్ చౌదరి తెలిపారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు మెజిస్టీరియల్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. "రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పరిపాలన బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయడంలో నిమగ్నమై ఉంది," అని అన్నారు.

ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని, వారు త్వరగా కోలుకోవాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఆకాంక్షించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ గాయపడిన వారిని ఆసుపత్రిలో కలిశారని, బస్సు హెడ్‌లైట్లు స్విచ్ ఆన్ చేయలేదని, ఇదే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ఒక రోగి తనతో చెప్పాడని చెప్పారు.

Next Story