వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్యంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 15 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూడూరు మండలం చిట్యంపల్లి శివారులో 15 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసి హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. బండరాయితో బాలిక తలపై మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సదరు బాలికను నాని అనే వ్యక్తి కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు. బాలిక మృతికి కారణం అతడేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు గురైన బాలిక పదో తరగతి చదువుతోంది. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోటానికి బహిర్భూమికి వెళ్లిన బాలిక.. ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో గ్రామ శివారులో బాలిక మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలాన్ని ఎస్పీ కోటి రెడ్డి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.