బీహార్‌లో కల్తీ మద్యం తాగి మ‌రో 10 మంది మృతి..!

10 people in Bettiah have died due to consumption of illegal liquor: State minister Sunil Kumar. బీహార్‌ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి మరో 10 మంది మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బెట్టియ్యా సిటీలో

By అంజి  Published on  5 Nov 2021 8:35 AM GMT
బీహార్‌లో కల్తీ మద్యం తాగి మ‌రో 10 మంది మృతి..!

బీహార్‌ రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి మరో 10 మంది మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బెట్టియ్యా సిటీలో జరిగింది. ఇప్పటికే గోపాల్‌గంజ్‌ జిల్లాలో మద్యం సేవించి 11 మంది మరణించారు. 8 మంది ఆస్పత్రి పాలయ్యారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలో కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య 21కి చేరింది. మద్యం కల్తీతో 21 మంది చనిపోవడంతో అక్కడి ప్రభుత్వం అధికారుల సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర మంత్రి సునీల్‌ కుమార్‌ తెలిపారు.

బీహార్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. కాగా మద్యం సేవించడం వల్ల ప్రజలు చనిపోవడం శాంతిభద్రతలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ మరణాలన్నీ గత రెండు రోజుల్లోనే జరిగాయి. రాష్ట్రంలో జరిగిన ఈ మరణాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేశారు. ఈ బాధాకరమైన ఘటనపై నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని తేజస్వి యాదవ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బీహార్‌ మంత్రి జనక్‌ రామ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని చెప్పారు. ఇది ఎన్డీయే ప్రభుత్వం ప్రభుత్వం పరువు తీసేందుకు జరిగిన కుట్ర కావచ్చని అన్నారు.

ఈ ఘటనపై గోపాల్‌గంజ్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని మహమ్మదాపూర్‌ గ్రామంలో గత రెండు రోజులుగా కొంతమంది అనుమానాస్పద స్థతిలో మరణించారు. మృతుల పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయి. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్ని కుటుంబాలు మృతదేహాలను దహనం చేసినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. గురువారం నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెట్టియా పోలీస్ సూపరింటెండెంట్ ఉపేంద్రనాథ్ వర్మ మాట్లాడుతూ.. ఇవి అసహజ మరణాలు అని, ప్రాథమిక విచారణ తర్వాత మాత్రమే మరింత సమాచారం తెలుస్తుందని అన్నారు.

Next Story