సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా
By అంజి Published on 7 April 2020 10:55 AM ISTముఖ్యాంశాలు
- కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- కరోనా కేసులను ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు
- 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ.. సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీపరిధిలోకి తీసుకువచ్చింది. 15 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా అనుమానం, నిర్దారణ, ఇతన వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజీని నిర్దారించింది. కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులకు వైద్యం అందిస్తే.. రూ.10,774, వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మరో రూ.5,631ను ప్రభుత్వం ఆస్పత్రులకు చెల్లించనుంది. దీనికి సబంధించింది కనీసం రూ.16 వేల నుంచి గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు నిర్ణయించింది. కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీ నిర్ణయించింది. ఈ మేరకు తక్షణమే ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 303కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటికే 74 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.