ఏపీలో ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ విరాళం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 30 Aug 2020 1:47 PM IST

ఏపీలో ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ విరాళం

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరాళం ఇచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ దంపతులు చేయూతనిచ్చారు. ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి విరాళమిచ్చారు.

శనివారం ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొనాల్సి ఉండగా కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా హాజరు కాలేదు. ఆలయ నిర్వాహకులు ఆయన పేరిట శిలాఫలకం ఆవిష్కరించారు. కేసీఆర్ దంపతులకు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఇక సీఎం కేసీఆర్‌ దైవచింతన ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ వచ్చాక పలు దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తెలంగాణలో యాద్రాద్రి టెంపుల్‌ను స్వర్గాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే.

Next Story