నిన్న పేకాట.. నేడు మద్యం మాఫియా.. ఏపీలో ఏందిలా?

By సుభాష్  Published on  29 Aug 2020 9:26 AM GMT
నిన్న పేకాట.. నేడు మద్యం మాఫియా.. ఏపీలో ఏందిలా?

ఏపీలో ఏం జరుగుతోంది? ఇప్పుడో ప్రశ్నగా మారింది. అందుకు భిన్నంగా రోజుకో ఉదంతం తెర మీదకు రావటం సంచలనంగా మారుతోంది. నిన్నటికి నిన్న టెంటు వేసి మరీ భారీగా పేకాట ప్రోగ్రాంను ఏర్పాటు చేయటం.. దాన్ని అడ్డుకోబోయిన పోలీసులపై దాడి చేయటం సంచలనంగా మారింది. ఈ ఉదంతాన్ని మరవక ముందే తాజాగా మరో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లా హిందూపురంలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. లక్షణ రేఖను పూర్తిగా దాటేసిన వారు.. ఎక్సైజ్ సిబ్బంది పైన దాడికి పాల్పడిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో.. పొరుగున ఉన్న కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అక్రమంగా అమ్ముతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్ఐ సరోజ.. ముగ్గురు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారు.

అక్రమ మద్యాన్ని సీజ్ చేసే క్రమంలో.. ఎస్ ఐ సరోజ ఫోన్ ను లాక్కోవటమే కాదు.. ఆమెపై దాడికి తెగబడ్డారు. ఎస్ ఐతో పాటు ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లపైనా దాడి చేశారు. ఈ ఉదంతంలో వారికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారుల మీద ఏపీలో పెరుగుతున్న దాడులపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్న మాట వినిపిస్తోంది.

Next Story