ధైర్యంగా పోరాడుదాం.. కరోనాను ఓడిద్దాం..
By అంజి
అమరావతి: ధైర్యంగా పోరాడుదాం.. కరోనాను ఓడిద్దాం అంటూ సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టేందుకు వైసీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ అన్నారు. పార్టీ నాయకులు, బూత్ స్థాయి క్రియాశీలక కార్యకర్తలకు కరోనాపై ఆయన దిశా నిర్దేశం చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటిస్తూనే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని సూచిస్తూ నిర్దిష్ట బాధ్యతలను అప్పగించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతూ.. ప్రజల్లో ధైర్యం నెలకొల్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఎం పేరుతో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది.
Also Read: లైవ్లో ఏడ్చిన యాంకర్ రష్మీ గౌతమ్
విధిగా స్వీయ భౌతిక దూరం పాటిస్తూ.. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించకుండా అప్రమత్తం చేయాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది గమనించాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి సమన్వయంతో అందరికీ నిత్యావసరాలు అందేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. మార్కెట్లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంతాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. అనాథలు, అన్నార్తులకు ఆహార సదుపాయాలు కల్పించాలని సూచించారు. అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు.
Also Read: హీరోయిన్లపై తీరుపై బ్రహ్మజీ ఆగ్రహం