త్వరపడండి.. కేజీ చికెన్ రూ.40 మాత్రమే
By తోట వంశీ కుమార్
నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలతో పాటు చికెన్ ధరలు కొండెక్కి సామాన్యుడికి చుక్కలు చూపించాయి. తాజాగా కోడి ధరలు కిందకు దిగొచ్చాయి. అధః పాతాళానికి పడిపోయాయి.
దీనికి ముఖ్య కారణం కరోనా వైరస్(కొవిడ్-19). ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల 3వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారత్లోనూ దీని కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జంతు మాంసాల నుంచి కూడా కరోనా వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో మాంసాన్ని తినడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో మాంసం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. కరోనా వైరస్ ప్రబలక ముందు తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైనా పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది.
మరోవైపు ఏపీలో పలు జిల్లాల్లో కోళ్లకు సోకిన వైరస్ కూడా చికెన్ ధరలు తగ్గడానికి కారణమయ్యింది. ఫారంలో ఉన్న కోళ్లు వింత వైరస్ సోకి చనిపోతున్నాయి. కోళ్లకు సోకిన వివిఎన్బీ N.B వైరస్ ఉభయ గోదావరి జిల్లావాసులను భయపెడుతోంది. దీంతో చికెన్ అంటేనే జనం భయపడిపోతున్నారు.
వ్యాపారులు తీవ్ర నష్టాలను భరించైనా ఉన్న వాటిని అయినకాడికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఓ దుకాణ యజమాని కిలో కోడి మాంసాన్ని రూ.40కే విక్రయిస్తానంటూ బోర్డు పెట్టారు. ఆయన లాగే చాలా చోట్ల వ్యాపారులు ధరను భారీగా తగ్గించి విక్రయిస్తున్నారు. నష్టాలను పంటి బిగువన భరిస్తున్నారు. అయినప్పటికి చికెన్ కోనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు.
చికెన్ తినడం వల్ల ప్రమాదం ఏమీ లేదని నిపుణులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం చికెన్ తినేందుకు ఇష్టపడడం లేదు.