యూపీఐ యూజర్లు.. ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు. ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో భారత్‌ ప్రపంచ దేశాలతోపోటీ పడుతుందనే చెప్పాలి.

By అంజి  Published on  11 Feb 2024 4:00 PM GMT
UPI users, UPI new rules, NPCI, India, RBI

యూపీఐ యూజర్లు.. ఈ కొత్త రూల్స్‌ మీకు తెలుసా?

ప్రస్తుత కాలంలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నారు. ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ విషయంలో భారత్‌ ప్రపంచ దేశాలతోపోటీ పడుతుందనే చెప్పాలి. 2016 వరకూ నగదు చెల్లింపులు ఎక్కువగా ఉండేవి. 2016 నవంబర్‌లో కేంద్రం నోట్లను రద్దు చేసిన తర్వాత నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ సేవలు విప్లవాన్ని సృష్టించాయి. అయితే ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత మెరుగుపరిచేలా, వినియోగదారుల కోసం మెరుగైన సౌలభ్యాలతో సురక్షిత లావాదేవీలను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పెరిగిన చెల్లింపుల పరిమితులు: విద్య, వైద్యం సంబంధిత చెల్లింపుల పరిమితి గతంలో రూ.లక్ష మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఆ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. యూపీఐ వినియోగాన్ని మరింత మెరుగుపర్చడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

క్రెడిట్‌ లైన్‌: యూపీఐపై ముందుగా మంజూరు చేసిన క్రెడిట్‌ లైన్‌ వ్యక్తులు, వ్యాపారాలకు రుణ లభ్యతను అందిస్తుంది. వ్యాపారులకు వారి అవసరాలు తీర్చుకునేందుకు వెంటనే లోన్‌ పొందడం సులభతరం అవుతుంది. పైగా తక్కువ వడ్డీకే రుణాలను పొందొచ్చు.

సెకండరీ మార్కెట్‌: నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుతం యూపీఐ ఫర్‌ సెకండరీ మార్కెట్‌ను ప్రవేశపెట్టింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టే నిర్దిష్ట పెట్టుబడులు, బహుళ ఉపసంహరణ లావాదేవీల పరిమితులను నిరోధించడానికి, చెల్లింపులను సెటిల్‌ చేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అయితే ఇది ప్రస్తుతం బీటా దశలో ఉన్నందున పరిమిత సెట్‌ పైలట్‌ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

యూపీఐ ఏటీఎం: దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ప్రవేశపెట్టనుంది ఆర్‌బీఐ. పూర్తి స్థాయిలో ఈ ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ఫిజికల్‌ డెబిట్‌ కార్డుల అవసరం తగ్గుతుంది. మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ఈ ఏటీఎంలను ఉపయోగించి నేరుగా నగదు తీసుకోవచ్చు. అందుకోసం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే యూపీఐ యాప్‌లను నుంచి ఎవరికి డబ్బు పంపించినా వారి బ్యాంక్‌ ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

కూలింగ్‌ పీరియడ్‌: ఆన్‌లైన్‌ చెల్లింపు మోసాలను తగ్గించడానికి ఆర్‌బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.2 వేల కంటే ఎక్కువగా మొదటి చెల్లింపు చేసే వినియోగదారుల కోసం నాలుగు గంటల కూలింగ్ పీరియడ్‌ను ప్రతిపాదించింది. ఈ నిర్ణీత గడవులోపు లావాదేవీలను రివర్స్‌ చేయడానికి లేదా సవరించడానికి వినియోదారులకు అవకాశం ఉంటుంది. యూజర్లు మునుపు ఎన్నడూ లావాదేవీలు చేయని మరో వినియోగదారుకు రూ.2 వేల కన్నా ఎక్కువగా మొదటి పేమెంట్‌ చేసిన ప్రతిసారీ ఈ కూలింగ్‌ పీరియడ్‌ వర్తిస్తుంది.

యూపీఐ ఆటో పేమెంట్లకు నో అథెంటికేషన్‌: కొన్ఇన సందర్భాల్లో రూ.1 లక్ష వరకు యూపీఐ పేమెంట్లు చేసేందుకు ఇకపై అదనపు ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ అవసరం లేదని ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించింది. ఎఎఫ్‌ఐ లేకుండా క్రెడిట్‌ కార్డ్‌ రీపేమెంట్స్‌, మ్యూచువల్‌ ఫండ్‌ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం కోసం రికవరింగ్‌ పేమెంట్‌లకు ఉపయోగించే ఈ మాండేట్‌ల పరిమితిని పెంచుతున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. దీనికి ముందు ఎఎఫ్‌ఐ లేకుండా ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు నగదు పరిమితి రూ.15 వేలుగా ఉండేది.

Next Story