రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేటు (ఈబీఎల్ఆర్)ను 7.90 శాతానికి కుదించింది. ఎమ్సీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2 నుంచి 3 ఏళ్ల వ్యవధి ఎఫ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాల వ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలోనే లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కింది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25 శాతం రెపోరేటును తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.35 శాతం నుంచి 8.10 శాతానికి, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 శాతం నుంచి 7.90 శాతానికి, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.35 శాతం నుంచి 8.10 శాతానికి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10 శాతం, కార్ లోన్ రేట్లు 7.45 శాతం నుంచి ప్రారంభం అవుతాయని బీవోఎమ్ తెలిపింది.