వంట నూనెల‌పై త‌గ్గ‌నున్న ధ‌ర‌ రూ.15

Edible oil prices set to fall further in India. వంట నూనెల‌ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)లో తక్షణమే రూ.15 తగ్గింపు ఉండేలా చూడాలని

By Medi Samrat  Published on  8 July 2022 4:00 PM GMT
వంట నూనెల‌పై త‌గ్గ‌నున్న ధ‌ర‌ రూ.15

వంట నూనెల‌ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)లో తక్షణమే రూ.15 తగ్గింపు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులను ఆదేశించింది. జులై 6న ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే అన్ని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లు, ప్రధాన తయారీదారులతో ప్రస్తుత ట్రెండ్‌పై చర్చించారు. గడచిన నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎడిబుల్ ఆయిల్స్ ధరలు తగ్గుతున్నాయ‌ని స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎంఆర్‌పీని తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఊర‌ట క‌ల్పించాల‌ని ఆదేశించింది. ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు ధరలను తగ్గించేందుకు అంగీకరించినట్లు అనేక వార్తా సంస్థ‌లు నివేదించాయి.

గత నెలలో టన్నుకు 350-450 డాలర్ల మేరకు వివిధ ఎడిబుల్ ఆయిల్స్ ధరలు తగ్గాయని ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇండోనేషియా, మలేషియా నుండి పామాయిల్.. రష్యా, ఉక్రెయిన్ నుండి పొద్దుతిరుగుడు నూనెతో సహా తినదగిన నూనె వినియోగంలో 60 శాతానికి పైగా భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. ఇక‌, 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో భార‌త్‌ ఎడిబుల్ ఆయిల్‌ల దిగుమతి దాదాపు 131.3 లక్షల టన్నులుగా ఉంద‌ని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్(SEA) సంకలనం చేసిన డేటా తెలిపింది. ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ఏర్పాటు చేసిన సమావేశంలో SEA సహా పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారని వర్గాలు తెలిపాయి.

భారతీయ రిటైల్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు గత నెల నుండి సడలించడం ప్రారంభించాయి, అదానీ విల్మార్, మదర్ డైరీ వివిధ రకాల వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ. 10-15 తగ్గించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూన్‌లో దేశవ్యాప్తంగా వేరుశెనగ నూనె మినహా ప్యాకేజ్డ్ ఎడిబుల్ ఆయిల్‌ల సగటు రిటైల్ ధరలు కిలోకు రూ.150-190 మధ్య స్వల్పంగా తగ్గాయి.













Next Story