హర్యానా ఉప ఎన్నిక బరిలో స్టార్ రెజ్లర్
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Oct 2020 12:50 PM GMTహర్యానా రాష్ట్ర ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రముఖ క్రీడాకారుడిని బరిలోకి దించింది. బరోడా స్థానం నుంచి రెజ్లర్ యోగేశ్వర్ దత్కు ఆ పార్టీ టికెట్ కేటాయించింది. ఒలింపిక్ మెడల్ సాధించిన యోగేశ్వర్ దత్ సోనిపట్ జిల్లా బరోడా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
బరోడా ఎమ్మెల్యే శ్రీ కృషన్ హుదా మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెల 3న పోలింగ్ జరుగనుంది. కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. గురువారం హర్యానా సీఎం ఖట్టర్ను ప్రముఖ క్రీడాకారులు బబితా ఫొగట్, సాక్షిమాలిక్, గీతా ఫొగట్, యోగేశ్వర్ దత్ కలిశారు. వారితో చర్చించిన ఆయన చివరికి యోగేశ్వర్ దత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ఇదిలావుంటే.. గతేడాది యోగేశ్వర్ దత్ బీజేపీలో చేరారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థిగానూ ఆయన పోటీ చేశారు. 2012 ఒలింపిక్ క్రీడల్లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించారు. 2014లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు. యోగేశ్వర్కు 2013లో ప్రభుత్వం.. దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీని ప్రకటించి గౌరవించింది.