మందుబాబులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఏపీలో తెరుచుకోనున్న బార్లు..!
By తోట వంశీ కుమార్ Published on 19 Sept 2020 8:46 AM ISTమందు బాబులకు శుభవార్త ఇది. చాలా రోజుల తరువాత మళ్లీ బార్లు ఓపెన్ అవుతున్నాయి. లాక్డౌన్లో ఇచ్చిన సడలింపుల్లో మద్యం దుకాణాలు ఓపెన్ చేసినా.. బార్లకు అనుమతి లభించలేదు. కాగా.. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి బార్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మూడు జీవోలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్స్లనూ కొనసాగించాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. వీటికి వచ్చే ఏడాది జూన్ 30 వరకు గడువు ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే లైసెన్స్పై 20 శాతం కోవిడ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.
అంతేకాకుండా.. పది శాతం మేర అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించబోతున్నారు. లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పది శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020-21 ఏడాదికి ఈ అదనపు రుసుముల్ని వసూలు చేస్తామని వెల్లడించింది అబ్కారీ శాఖ. కోవిడ్ ఫీజుల ద్వారా రూ.40 కోట్లు, అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా రూ.300 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, రెడీ టూ డ్రింక్ మద్యం, బీర్లపైనా 10 శాతం మేర అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.