కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారా?

By Newsmeter.Network  Published on  27 March 2020 10:14 AM GMT
కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి భారత్‌లో ఇప్పటికే 724మంది మృత్యువాత పడగా.. 17మంది మృతి చెందారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుంది. తెలంగాణలో ఇప్పటికే 45కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏపీలో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పలువురు అనుమానితులను ఆయా ప్రాంతాల్లోని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ వైరస్‌ను వ్యాప్తిచెందకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. దీంతో ప్రజలంతా గత నాలుగు రోజులుగా ఇండ్లకే పరిమితమవుతున్నారు. కేవలం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే నిత్యవసర వస్తువులు, ఇతర అత్యవసరమైన పనుల నిమిత్తం బయటకు వచ్చేందుకు అనుమతించారు.

Also Read :యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్‌ చేసిన డీజీపీ

అన్ని ప్రాంతాల్లో ప్రజలకు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామ, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు అనే తేడాలేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పలువురు అత్యవసరమైన పనుల నిమిత్తం బయటకు వస్తున్న తరుణంలో పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నామని, కానీ పోలీసులు ప్రతీసారి లాఠీలు ఝుళిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పలువురు పోలీసులు ఓవర్‌గా రియాక్ట్‌ అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్దిచెబితే పోయేవారిపై సైతం లాఠీలు ఎత్తుతుండటంతో వామ్మో పోలీస్‌ అంటూ పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతుంది.

Also Read :కరోనా భయంతో.. అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు.. చివరికి

కర్నూల్‌ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్‌ ఓ యువకుడి ప్రాణం తీసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా బయటకు వచ్చిన యువకుడిపై పోలీసులు లాఠీలతో విచ్చలవిడిగా కొట్టడంతో ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పెవల్లిలో దుబాయి నుంచి వచ్చిన యువకుడిపై ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఆ యువకుడిని బయటకు లాగిమరీ లాఠీతో కొట్టాడు. దుబాయ్‌ నుంచి వచ్చి స్వీయ నిర్బంధంలోకి వెళ్లకుండా ఎందుకు ఉన్నావ్‌ అంటూ లాఠీఝుళిపించాడు. దీంతో ఆ యువకుడు సమాధానమిచ్చే పరిస్థితి కూడా లేకుండా కొడుతుండటంతో తండ్రి అడ్డమొచ్చాడు. తండ్రినిసైతం కొట్టడంతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా ఎస్‌ఐ లాఠీ ఎత్తాడు. ఈ ఘటనను పలువురు వీడియోతీసి సోషల్‌ మీడియాలో పోస్టుచేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోకాస్త డీజీపీ దృష్టికి వెళ్లడంతో కిరణ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశించారు.

Also Read :ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి అభినందనలు

విదేశాలను వచ్చిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు పంపించాలి తప్ప దాడి చేయటం సరికాదంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మండిపడ్డారు. ఇలాంటివి మళ్లి పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువకులను పలువురు పోలీసులు చితకబాదారు. కృష్ణా జిల్లాలోని విలేకరులు కవరేజ్‌ కోసం వెళ్లగా వారిని ఓ పోలీస్‌ చితకబాదారు. మేము విలేకరులం అని చెబుతున్నా పట్టించుకోకుండా కొడుతూనే ఉండటంతో వారు ఆందోళనకు దిగారు. విలేకరులని తెలిసికూడా పోలీసులు కొడుతుండటం గమనార్హం. తెలంగాణలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Also Read :చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. ప్రజా వ్యతిరేఖ నాయకుడా?

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యవసరమని బయటకు వచ్చినా, ఇతర స్టేషన్‌లలో అనుమతి తీసుకొని బయటకు వచ్చినా పోలీసులు మాత్రం అవేవీ పట్టించుకోవటం లేదు. కొందరు పోలీసులు కేవలం కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో జర్నలిస్టుల జోలికెళ్లొద్దని, నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చినా, అత్యవసరమైన పనుల కోసం బయటకు వచ్చినా ముందు తెలుసుకొని వారిని ఇండ్లకు పంపించేలా చూడాలని కేసీఆర్‌ సూచించారు. కానీ కొందరు పోలీసులు మాత్రం ఆడ, మగ, ముసలి అనే తేడాలేకుండా ముందు కొట్టడమే మన పనిగా అనట్లు కొడుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు పోలీసులంటే అసహించుకుంటున్నారు.

Next Story