ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానం ఆరంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2020 7:33 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త పారిశ్రామిక విధానం ఆరంభం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి సోలోమన్ ఆరోక్యరాజ్, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్ హాజరయ్యారు.

ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానం, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తలను ఆకర్షించేలా ఈ పాలసీకి రూపకల్పన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు. అన్ని ప్రాంతాల, సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిర్దేశించుకున్న కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం సమానవృద్ధికి దిక్సూచిగా మారనుంది. పారిశ్రామిక ప్రపంచంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వెన్నుదన్నుగా, వాణిజ్య ఖర్చును తగ్గించే వినూత్న పద్ధతులను అవలంబించనుందీ పాలసీ. 30 నైపుణ్య కళాశాలలను, 2 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి యువతీ, యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం, పారిశ్రామికవేత్తలుగా మలచడం, ఉన్నతమైన జీవన ప్రమాణాలను సృష్టించడం వంటి కీలక విషయాలపై పారిశ్రామిక అభివృద్ధి విధానం దృష్టిసారించనుంది.

రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయడంతో పాటు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంపైనా పాలసీ ప్రత్యేకదృష్టి సారించింది. ప్రణాళికబద్ధమైన పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వనుంది. రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి 'ప్రమాద రహిత(Investment-friendly) -స్నేహపూర్వక వాతావరణాన్ని(Friendly Environment) అందించడానికి పారిశ్రామిక జోనింగ్ ను అమలు చేయాలని పారిశ్రామిక విధానం 2020-23 సంకల్పించింది. ఒక ప్రత్యేక పద్ధతిలో 'లీజు కమ్ బై ఔట్' నమూనాలో భూ కేటాయింపు ఇవ్వనుంది.

పెట్టుబడిదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని "వైయస్ఆర్ ఏపీ వన్" పేరుతో బహుముఖ వ్యాపార కేంద్రానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా పెట్టుబడిదారులకు పూర్తి కాలం తోడ్పాటు అందించడమే చెక్కు చెదరని ఉక్కుసంకల్పం. ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్ సపోర్ట్, ప్రోత్సాహక నిర్వహణ మరియు స్పెషల్ కేటగిరీ సేల్ వంటి సేవలను విరివిగా అందించడానికే 'వైయస్ఆర్ ఏపి వన్' సెల్ ఏర్పాటుకు మూలకారణం. పెట్టుబడిదారులకు ఆద్యంతం అవసరం మేరకు మద్దతు అందిస్తూ పెట్టుబడులకు అవాంతరాలు లేకుండా పాలసీకి మూలస్తంభమైన పరిశ్రమల స్థాపనకు కృషి.

ఈ కొత్త పారిశ్రామిక విధానంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలు, విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞులతో విస్తృతమైన సంప్రదింపులతో పాటు, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన అనంతరం అత్యుత్తమ విధివిధానాలు పాలసీలో పొందుపరచి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ విధానం యువత, మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్‌ ఆలోచనలు ఆచరణలో పెట్టేలా.. అట్టడుగు స్థాయిలో ప్రభావితం చేయగల సమాన అభివృద్ధిపై ప్రత్యేకంగా పాలసీ దృష్టి కేంద్రీకరించడం జరిగిందని, అందుకోసం ఎస్సీ / ఎస్టీ / బిసి వర్గాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు విధివిధానాలు రూపొందించామన్నారు. తద్వారా సీఎం స్వప్నించిన మహిళా సాధికారతను వాస్తవంలోకి తీసుకురావాలని ఈ విధానం దృష్టి సారించిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా పారిశ్రామికరంగంలో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించే విధంగా పరిశ్రమలకు కావలసిన ఉత్తమమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాప్యం, అవాంతరాలు లేని వినూత్న పద్ధతులు , నైపుణ్యం కలిగిన కార్మికులను అందించడం, ఎండ్ టు ఎండ్ హ్యాండ్‌హోల్డింగ్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని మంత్రి మేకపాటి వెల్లడించారు.

Next Story