ఏపీలో నామినేషన్ల స్వీకరణ
By అంజి Published on 9 March 2020 8:57 AM IST
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. 14వ తేదీన సాయంత్రం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మార్చి 21వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 24న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 30వ తేదీన పరోక్ష పద్దతిలో జెడ్పీ చైర్మన్, వైఎస్ చైర్మన్, కో అప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ, కో అప్షన్ సభ్యుల ఎన్నిక జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలు, 9,984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఇవాళ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయనుంది. ఒకే విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 14 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. మార్చి 16వ తేదీన 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 27 ఉదయం 8 గంటలకు ఓట్లు లెక్కించున్నారు. ఈ నెల 31న పరోక్ష పద్దతిలో కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మున్సిపాలిటీలకు చైర్మన్, వైఎస్ చైర్మన్లో ఎన్నిక జరుగుతుంది.