ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
By అంజి Published on 21 Dec 2019 7:17 AM GMTఅమరావతి: తాడేపల్లిలోని నివాసంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టిన రోజు సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. సీఎం జగన్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనంజయరెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, సీఎం కార్యాలయ అధికారులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్లో సీఎం జగన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా సీఎం జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు టీడీపీ నేత నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో వైఎస్ అవినాష్రెడ్డి పార్టీ నేతల మధ్య కేక్ కట్ చేశారు. సింహాద్రిపురం మండలం బలపనూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. విశాఖలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి, ఎంపీ సత్యనారాయణ, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. సీఎం జగన్ ఆరు నెలల్లో మంచి పరిపాలన అందించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లపాటు సీఎంగా జగన్ ఉండాలని కోరుకుంటున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. అన్ని జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథాకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ప్రభుత్వం రూ.24 వేల ఆర్థికసాయం అందజేయనుంది. నేతన్న నేస్తం పథకంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.