మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్‌ సెషన్స్‌..

By అంజి  Published on  29 Feb 2020 9:33 AM GMT
మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్‌ సెషన్స్‌..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదట స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత బడ్జట్‌ సెషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును ఈ నెల 27కు రిజర్వ్‌ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిసింది.

మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 6వ తేదీన గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గవర్నర్‌ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేసి.. మార్చి 9వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్‌ సమావేశాలపై మార్చి 4వ తేదీన మంత్రివర్గం సమావేశం నిర్వహించి సమావేశాల తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మార్చి 9వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి.. ముహూర్తం బాంగుందని పండితులు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. కావున ఆరోజే బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పద్దును ప్రవేశపెడుతారు. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను కురసాల కన్నబాబు ఇంట్రొడ్యూస్‌ చేస్తారు. వీరిద్దరూ మండలిలోనూ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన తర్వాత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అనుకుంది. ఈ నెల 10వ తేదీన జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన రిజర్వేషన్ల నోటిఫికేషన్‌ జారీ చేసంది. మార్చి 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం జగన్‌ భావించారు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్‌పై ఫిబ్రవరి 27వ తేదీన తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. దీంతో మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికలు రిజర్వేషన్‌ ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సమాచారం.

Next Story