తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. నన్ను 73 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. విజయవాడ నుంచి నేరుగా పర్యవేక్షించారన్నారు. కనీసం జైలు అధికారులు కూడా నాతో మాట్లాడటానికి భయపడ్డారు. ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా చూశారన్నారు మిథున్ రెడ్డి.
కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి తనను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తోందని, 2014-2019 మధ్య కాలంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేశారని మిథున్ రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అక్రమ కేసులకు తాను భయపడనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.