మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే తాజాగా గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ఆయన పాలుపంచుకున్నారు.
పార్టీ శ్రేణులు సేకరించిన వినతిపత్రాలను జిల్లా కమిటీకి అందించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలన్న గొప్ప సంకల్పంతో మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని ఈ సందర్భంగా కొడాలి నాని తెలిపారు. వైసీపీ హయాంలో ఐదు కాలేజీలు పూర్తయ్యాయని, మరో ఐదు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ప్రజల నుంచి తమ ఉద్యమానికి మంచి స్పందన వస్తోందని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.