వారిద్దరిపై యాక్షన్ తీసుకోవాలి : అంబటి రాంబాబు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసును ఆశ్రయించారు.
By Medi Samrat
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ఆశ్రయించారు. వైసీపీకి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తమ పార్టీపైనా, పార్టీ నేతలపైనా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం తమ పార్టీపైనా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా, తనపైనా దుష్ప్రచారం చేస్తోందని అంబటి రాంబాబు ఆరోపించారు.
వైసీపీ కండువా వేసుకుని ఆరోపణలు చేస్తున్న సీమ రాజా పైనా, మాజీ మంత్రి రోజా తదితరులపై అనుచిత వీడియోలు చేస్తున్నారంటూ కిర్రాక్ ఆర్పీ పైనా వేర్వేరుగా ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. గతంలో తాము చేసిన ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని, అందుకే ఈసారి ఫిర్యాదు చేసి, అందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకున్నానన్నారు. తమ ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని, కానీ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం వెంటనే స్పందించి కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించే వరకు విశ్రమించబోమని, అవసరమైతే ఈ విషయంపై సుప్రీం కోర్టు వరకు వెళ్లేందుకైనా సిద్ధమని అన్నారు.