ఏపీలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద గతేడాది.. ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన 9.48 లక్షల రైతుల ఖాతాల్లో ఖాతాల్లో రూ.1,252 కోట్లను జమ చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ పంటల బీమా పథకంతో పాలనా పరంగా మరో అడుగు ముందుకేశామని తెలిపారు. గతంలో పంటల బీమా పథకంలో చేరేందుకు రైతులు నిరాకరించేవారని కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతు కూడా ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. కానీ బీమా సొమ్ము ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరుపున బీమా ప్రీమియం చెల్లిస్తున్నామని అని తెలిపారు. రాష్ట్రంలో కోటి 14లక్షల ఎకరాలను భీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. పంట నష్టం జరిగితే.. భీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్నారు. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని.. వాటన్నింటినీ గ్రామ సచివాలయాతో అనుసంధానించామని సీఎం చెప్పారు.