ఆ కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే.. కర్త, కర్మ, క్రియ జగన్ : వైఎస్ షర్మిల
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలు అని.. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Medi Samrat
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి పచ్చి అబద్ధాలు అని.. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారని వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. రాష్ట్ర జీవనాడి అయిన ప్రాజెక్టులో జీవం తీసేశారన్నారు. ఎత్తు తగ్గించి 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారని.. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారన్నారు. 22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. సాగునీరు అందించే మహానేత YSR నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని YSR అనుకుంటే.. 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్గా మార్చుతూ.. నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారన్నారు. 41.15 మీటర్ల ఎత్తుకి, రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా.? అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే, కేంద్ర ప్రభుత్వంతో వెంటనే అధికారిక ప్రకటన చేయించండి.. తక్షణమే ప్రాజెక్టు కొత్త DPR బయటపెట్టండి.. అఖిలపక్షాన్ని పిలిచి నిజానిజాలు చెప్పండి.. పునరావాస చర్యలకే రూ.30వేల కోట్లు దాటుతుంటే, తీసుకుంటున్న చర్యలు ఏంటో వివరించండని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇక పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత YCP పార్టీకి లేదన్నారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు ఉచ్చరించే హక్కు లేనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరు వింటే YSR గుర్తుకు వచ్చే మీకు.. 5 ఏళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా .? YSR జీవిత ఆశయం పోలవరం అని మీకు తెలియదా.? అధికారంలో ఉండగా తట్టెడు మట్టి అయినా తీశారా.? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించే ప్రతిపాదనకు ఒప్పుకున్నది మీరు కాదా.? నాడు ప్రధానికి రాసిన లేఖల్లోనూ 41.15 మీటర్ల మేరకు నిధులు విడుదల చేయాలని అడగలేదా.? అని ప్రశ్నించారు
వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి మీ అనాలోచిత నిర్ణయాలే కారణం అని.. పోలవరం అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా.? అని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారు.. కుడి, ఎడుమ కాలువల సామర్థ్యాన్ని తగ్గించి మహానేత ఆశయాలకు తూట్లు పొడిచారు.. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసే కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయితే.. కర్త, కర్మ, క్రియ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.