ఎదురుచూపులు తప్పడం లేదు.. కూటమి సర్కార్పై షర్మిల ఫైర్
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 25 Feb 2025 7:34 PM IST
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తిగా సత్యదూరం అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ప్రజల అంచనాలకు భిన్నంగా 30 మోసాలు, 60 అబద్ధాలు అనే సామెతను తలపించిందన్నారు. గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారని.. కూటమి కరపత్రాన్ని చదివించారని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం తప్పా.. మ్యానిఫెస్టో హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన ఎక్కడా లేదన్నారు. 8 నెలలు దాటినా ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పలేదన్నారు.
సూపర్ సిక్స్ పథకాలపై క్లారిటీ లేనే లేదు.. జాబ్ క్యాలెండర్ లాంటి మిగతా హామీలపై అసలు ప్రస్తావనే లేదన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణం అంటూ కాలయాపన తప్పా.. పథకాలను అమలు చేస్తారని ఎదురుచూస్తున్న ప్రజలకు.. గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు.
రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అబద్ధాలు చెప్పారు.. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించామని అభూత కల్పన సృష్టించారు.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ భర్తీ చేయకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా.. విద్యా, వైద్య రంగాలను ఉద్ధరించినట్లు అసత్యాలు పలికారు.. గిట్టుబాటు ధర లేక, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే, రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉందని చెప్పడం శుద్ధ అబద్ధం అని మండిపడ్డారు.
జలయజ్ఞం కింద చేపట్టిన దాదాపు 30 ప్రాజెక్టులు దశాబ్ద కాలంగా మూలుగుతుంటే.. వాటిని పూర్తి చేసే చిత్తశుద్ది కూడా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. రూ.3వేల నిరుద్యోగ భృతి కోసం 50 లక్షల మంది యువత.. 84 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎకరానికి రూ.20 వేలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకం కోసం 54 లక్షల మంది రైతులు.. ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకం కోసం కోటి మంది మహిళలకు ఎదురుచూపులు తప్పడం లేదన్నారు.
పేదవాళ్లకు సొంత ఇంటి కోసం చేపట్టిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం లేదన్నారు.. అందుకే ఈ నెల 28న ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల ఆశయాలకు అద్దంపట్టేలా ఉండాలని.. సూపర్ సిక్స్ హామీలను ఈ ఏడాది నుంచే అమలు చేసేలా నిధులు కేటాయించాలని.. జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.