Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్‌ షర్మిల

రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు.

By అంజి  Published on  29 July 2024 7:00 AM GMT
YS Sharmila, AP government, farmers, CM Chandrababu

Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్‌ షర్మిల

రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. అటు ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలు, మరిన్ని కోస్తా ప్రాంతాల్లో పంటలు, పల్లెలు నీటమునిగి నేటికీ దాదాపు మూడు వారాలు అయ్యిందన్నారు. ఇప్పటికీ మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. రైతులు, ప్రజలూ అలకల్లోలంలో కొట్టుకుపోతున్నారని, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్లీ తాజాగా కోనసీమ వరదనీటిలో చిక్కుకుందని అన్నారు. ఇప్పుడు చేస్తున్న సాయం మీద స్పష్టత ఏదని షర్మిల నిలదీశారు.

''బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసింది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు. ఏపీ పట్ల ఎందుకు కేంద్రానికి ఇంత నిర్లక్ష్య ధోరణి? ఏపీకి చెందిన 25 ఎంపీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా..? మరి ఢిల్లీలో మీ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు, విపత్తు దళాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పటికీ ప్రాథమిక అంచనా, మధ్యంతర అంచనా జరిపించారా లేదా? నష్టపరిహారం మీద ఇంకా స్పష్టత లేదు?'' అని షర్మిల పేర్కొన్నారు.

ఇవన్నీ వదిలేసి, పునరావాస కేంద్రాల గురించి మాత్రమే మాట్లాడుతూ, కనీసం ఎప్పుడు పర్యటిస్తారో కూడా చెప్పకపోవడం ప్రజల్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందన్న షర్మిల.. ప్రతి రైతు ఎకరానికి రూ.15000 రూపాయలు ఖర్చుపెట్టాడని తెలిపారు. అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా జరిగిందని, మొత్తం నష్టం కలిపి సుమారు రూ.800 కోట్లు(అంచనా) అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

''మరి ఇంత భారీ ఎత్తున పంట నాశనం అయితే ఆదుకోవాల్సింది సర్కారే కాదా? మెడ లోతు నీళ్లలో మునిగి మేము కాంగ్రెస్ నాయకులం రైతన్న కష్టాన్ని మీకు వివరించాము. మా నిబద్ధతలో మీకు పావు వంతు ఉన్నా మీ సర్కారు ఈ నిర్లక్ష్యం చూపదు. వెంటనే వరద పీడిత ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి, రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలి'' అని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story