రాష్ట్రంలో న్యాయానికి చోటు ఉందా? మూల్యం చెల్లించక తప్పదు..వంశీ అరెస్ట్‌పై జగన్ ట్వీట్

By Knakam Karthik  Published on  14 Feb 2025 4:10 PM IST
Andrapradesh, YS Jagan, Ysrcp, Tdp, Cm Chandrababu, Vallabhaneni Vamsi

రాష్ట్రంలో న్యాయానికి చోటు ఉందా? మూల్యం చెల్లించక తప్పదు..వంశీ అరెస్ట్‌పై జగన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంతో సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని అన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు అని విమర్శించారు.

సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్న‌ది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

చంద్రబాబు గారూ.. ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.

Next Story