ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమే : జ‌గ‌న్

ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నారు. తాడేపల్లిలో వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జ‌రిగింది.

By Medi Samrat  Published on  20 Jun 2024 10:46 AM GMT
ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమే : జ‌గ‌న్

ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయని వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నారు. తాడేపల్లిలో వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి హాజ‌రైన జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల ఫలితాలు చూసిన తర్వాత బాధ కలిగిందని అన్నారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందని.. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. అయితే ఆధారాలు లేకుండా మాట్లాడలేమ‌న్నారు. 40 శాతం ఓట్లు మనకు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దని నేత‌ల‌తో అన్నారు. 2019తో పోలిస్తే 10 శాతం మాత్ర‌మే ఓట్లు తగ్గాయన్నారు.

ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని.. చంద్రబాబు మోసాలను, ప్రలోభాలను ప్రజలు గుర్తిస్తారని అన్నారు. 2029లో వైసీపీని ప్రజలే అధికారంలోకి తెచ్చుకుంటారని జ‌గ‌న్ నేత‌ల‌కు ధైర్యం నూరిపోశారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.. శ్రీకృష్ణుడి తోడు ఉన్న పాండవులు అప్పుడప్పుడు ఓడిపోయారని గుర్తు చేశారు. చివరకు ప్రతి ఒక్కరూ అర్జునుడులా విజయం సాధిస్తారని చెప్పారు. 99% హామీలు అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు మీద జరుగుతున్న దాడులపై స్పందించిన జగన్.. నేత‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి పార్టీ అండ‌గా ఉంటుంద‌నే భ‌రోసాను ఇవ్వాల్సిందిగా సూచించారు.

Next Story