'ఇవేం ధరలు.. రైతు అనేవాడు బతకొద్దా?'.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల దుస్థితి పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉంటున్నారని వైఎస్‌ఆర్‌సి అధ్యక్షుడు..

By -  అంజి
Published on : 17 Sept 2025 6:31 AM IST

YS Jagan, CM Chandrababu, farmers, APnews

'ఇవేం ధరలు.. రైతు అనేవాడు బతకొద్దా?'.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల దుస్థితి పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉంటున్నారని వైఎస్‌ఆర్‌సి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పంటలకు ధరల పతనంలో సీఎం చంద్రబాబు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావంటూ సెటైర్‌ వేశారు. ''కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?'' అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేసిన సీఎం చంద్రబాబు.. దానిని తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

''ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబు? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం'' అంటూ వైఎస్‌ జగన్‌ ఫైర్‌ అయ్యారు. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదని, కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు.. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Next Story