సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. అధికారులు వైసీపీ నేతలను వేధిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి ఎన్నో నేరాలు చేస్తున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారని, పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారన్నారు. నందిగం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారన్నారు. బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా బాబుకు వాచ్మెన్లా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనే ఎప్పుడూ కొనసాగదని, తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టమన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీకి బలం లేకపోయినా ఎన్నికల్లో నిలుస్తోందని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్నాననే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.