వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కనీస ధర మద్దతు (ఎంఎస్పీ) హామీ ఇవ్వడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పొదిలిలో విలేకరులతో మాట్లాడుతూ, పొగాకు ధరలు కిలోకు రూ.360 నుండి రూ.240కి పడిపోయాయని, ప్రభుత్వ సహాయం లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ అన్నారు.
కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడని, వైసీపీ హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదని, కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారని, మోదీ ఇచ్చినా చంద్రబాబు ఎగ్గొట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారని ఆరోపించారు.