రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు 'యోగాంధ్ర-2025' ప్రోగ్రామ్

'యోగాంధ్ర 2025' అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది.

By Knakam Karthik
Published on : 25 May 2025 4:59 PM IST

Andrapradesh, Ap Government, Cm Chandrababu, Yogandhra-2025, International Yoga Day

రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు 'యోగాంధ్ర-2025' ప్రోగ్రామ్

జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'యోగాంధ్ర 2025' అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య వైద్య శాఖ ప్రకటించింది.మే 21 నుండి జూన్ 21 వరకు ఒక నెల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, పోటీలు,శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు మరియు చారిత్రక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు నిర్వహించి, యోగాభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యోగా గురువులు, యోగా శిక్షకులు, వాలంటీర్లు,యోగా అభ్యాసకులు,సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకుని పాల్గొనవచ్చు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో థీమ్ ఆధారిత యోగా ప్రదర్శనలు,పోటీలు, సామూహిక యోగాభ్యాసం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.

యోగా పోటీల్లో మూడు వయోవర్గాలు వారు పాల్గొనవచ్చు. “జూనియర్” వర్గంలో 10 నుండి 18 సంవత్సరాల వరకు, “యంగ్” వర్గంలో 19 నుండి 35 సంవత్సరాల వరకు, “సీనియర్” వర్గంలో 35 సంవత్సరాలకు మించిన వారు పాల్గొనవచ్చు. సోలో యోగాలో ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం,ధ్యానం వంటి విభాగాలు ఉంటాయి.గ్రూప్ యోగా,యోగా పాట, చిత్రలేఖనం,యోగా నాటకం మరియు నాట్యం,క్విజ్, పోస్టర్,నినాదం,వ్యాసం,షార్ట్ ఫిల్మ్,ఫోటోగ్రఫీ,ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ పోటీలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6:00 వరకు జరుగుతాయి.రాష్ట్ర స్థాయి పోటీలు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు జరుగుతాయి.

ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికీ ప్రచార కార్యక్రమం,మే 27న పెద్ద స్థాయిలో ర్యాలీ, కరపత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు మరియు ఆంగ్ల వార్తాపత్రికలు,టెలివిజన్ చానెల్స్‌లో ఈ కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని వివిధ ప్రచార మాధ్యమాల ప్రతినిధులను ప్రభుత్వం కోరుతోంది.యోగా గురువులు,యోగా శిక్షకులు, వాలంటీర్లు,యోగా అభ్యాసకులు,సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొని యోగాంధ్ర 2025 ప్రచారాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సవివరమైన క్యాలెండర్ ను ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. వివరాలకు స్థానిక ఆరోగ్య అధికారులను,జిల్లా కలెక్టర్ కార్యాలయాలను సంప్రదించ వచ్చని తెలిపారు.

Next Story