8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’.. మరో ముంబైలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు
‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని.. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
By Medi Samrat
‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని.. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం.. మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనమిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలన్నారు. 8 జిల్లాల్లో వివిధ ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 36 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగివున్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం 49 బిలియన్ డాలర్ల జీడీడీపీ నమోదవుతోందని... 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుందన్నారు.
7 గ్రోత్ డ్రైవర్లు గుర్తింపు :
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 6 పోర్టులు, 7 మాన్యుఫాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్తో విశాఖ ఎకనమిక్ రీజియన్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలికవసతుల కల్పన... ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందన్నారు.
సాకారమైతే ఫలితాలు ఇలా :
విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆస్పత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
సముద్ర తీరం – సంపద నిలయం :
‘మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రహదారులు నిర్మిస్తాం. వీటిని జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. సముద్ర తీరం సంపద నిలయం దానిని మరింత వినియోగించుకునేలా చూడాలి. పర్యాటకాన్ని పరిశ్రమగా గుర్తించాం, నూతన పాలసీ పెట్టుబడిదారులకు ఎంతో అనుకూలం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యువతకు నిరంతరాయంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ - నాలెడ్జ్ ఎకానమి అవుట్ సోర్సింగ్ విధానాలు అవలంభిస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద 20 లక్షల మందికి అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నాం.’ అని ముఖ్యమంత్రి అన్నారు.
సమీక్షలో చర్చించిన మరికొన్ని అంశాలు :
• దేశంలోని టాప్ 3 స్టీల్ పరిశ్రమలతో స్టీల్ హబ్గా తీర్చిదిద్దడం... అలాగే పెట్రో కెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్-మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్పై దృష్టి పెట్టాలని నిర్ణయం.
• వచ్చే 7 ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా లక్ష్యం. డేటా సెంటర్లు, స్టార్టప్లు-ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం.
• ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2032 కల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తిచేయడం.
• మాన్యుఫాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించేలా కొత్తగా 9 రోడ్డు ప్రాజెక్టులు చేపట్టడం.
• 2028-30 కల్లా 77 కి.మీ. మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై చర్చించారు.
ఏపీ విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శం :
‘1998లో విద్యుత్ సంస్కరణలు దేశంలోనే తొలిసారిగా తీసుకువచ్చాం. 2014లో రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు అదే అత్యంత చవకైన విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పించింది. టెక్నాలజీ పరిధి పెరిగింది. దీనిని విద్యుత్ రంగంలో వినియోగించే అద్భుతాలు సాధించాం. ఇప్పుడు ప్రజలే ఉత్పత్తిదారులు-వినియోగదారులుగా చేసేలా నూతన విధానాలు అమలు చేస్తున్నాం. ఎవరి విద్యుత్ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే విద్యుత్ సరఫరా నష్టాలు అనేవి ఉండవు. ఈవీ వాహనాలకు అందరూ మళ్లితే రవాణా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సోలార్, విండ్ పవర్తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందుకుతగ్గ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరుతున్నాను.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా ప్రణాళికలు :
• ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ ట్రాన్సిషన్ రోడ్ మ్యాప్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - నీతి ఆయోగ్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ మధ్య ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదిరింది.
• ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 27.3 గిగావాట్లుగా ఉంది.
• రాష్ట్రంలో 2019లో 55.6 బిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ 2025 నాటికి 69.7 బి.యూ.కు చేరింది. ఇందులో పరిశ్రమలో రంగంలో 4.8 శాతం, గృహ వినియోగానికి 5.1 శాతం మేర డిమాండ్ పెరిగింది.
• వచ్చే ఏడాదికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 88.6 బి.యూ నుంచి 2035 నాటికి 163.9 బి.యూ. కు చేరుకోనుంది.
• ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 2029 నాటికి 78.50 గిగావాట్ల సోలార్ విద్యుత్, 35 గిగావాట్ల విండ్, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ 1.50ఎంఎంపీటీఏ, బ్యాటర్ స్టోరేజ్ 25 గిగావాట్లు, ఎథనాల్ 1,500 కెఎల్పీడీ, 5,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు, 10,000 టీపీడీ బయో సీఎన్జీ-సీబీజీ లక్ష్యం.
• క్లీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రానికి ఇప్పటిదాకా రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 57.7 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది.
ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం, సీఎస్ విజయానంద్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.